Saturday, December 1, 2012

శ్రీమద్భాగవతం ప్రధంస్కంధం పద్దెనిమిదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ప్రధంస్కంధం పద్దెనిమిదవ అధ్యాయం

సూత ఉవాచ
యో వై ద్రౌణ్యస్త్రవిప్లుష్టో న మాతురుదరే మృతః
అనుగ్రహాద్భగవతః కృష్ణస్యాద్భుతకర్మణః

బ్రహ్మకోపోత్థితాద్యస్తు తక్షకాత్ప్రాణవిప్లవాత్
న సమ్ముమోహోరుభయాద్భగవత్యర్పితాశయః

ఈ పరీక్షిత్తు బ్రహ్మదండంతో కూడ దండింపబడని వాడు, అత్యాశ్చర్య కరములైన పనులు చేసే కృష్ణపరమాత్మ చేత కాపాడబడ్డాడు.
ఈయన రెండు రకాల గొప్పవాడు 1. బ్రహ్మాస్త్రం చేత దహింపబడలేదు భయపడలేదు 2. బ్రహ్మ దండానికి (శాపానికీ) భయపడలేదు.
ఈయన మరణానికి భయపడలేదు. ఓంటి స్తంభం మేడలో ఉన్నడని చెప్పిన కథ వాస్తవం కాజాలదు. ఇంత ఉదాత్తంగా ప్రవర్తించినవాడు కలి పురుషున్ని శాసించినవాడు బ్రహ్మ శాపాన్నుంచి తప్పించుకోచూడ జాలడు. ఆయన భయపడలేదు (న సమ్ముమోహ)
ఆ కబురు తెలియగానే ఉన్నవన్నీ విడిచిపెట్టాడు

ఉత్సృజ్య సర్వతః సఙ్గం విజ్ఞాతాజితసంస్థితిః
వైయాసకేర్జహౌ శిష్యో గఙ్గాయాం స్వం కలేవరమ్

పరమాత్మ గురించి తెలిసినవాడు కాబట్టి వ్యాసునికి శిష్యుడై (వైయాసకేర్జహౌ ) అన్నీ వదిలిపెట్టాడు.

నోత్తమశ్లోకవార్తానాం జుషతాం తత్కథామృతమ్
స్యాత్సమ్భ్రమోऽన్తకాలేऽపి స్మరతాం తత్పదామ్బుజమ్

బ్రాహ్మణ శాపం తక్షక విషం ప్రాణాపాయం ఇవన్నీ ఉన్నా ఆయన భయపడలేదు. పరమాత్మ కథమృతాన్ని పానామృతం చేస్తున్నవారు (జుషతాం) సేవిస్తున్న వారు అంతకాలంలో కూడా భయం తొట్రుపాటు ఉండవు (నోత్తమశ్లోకవార్తానాం ). పరమాత్మ పాదాలను ధ్యానిస్తున్న వారికి భయం ఉండదు ఏ కాలంలో అయినా. (భూ: పాదౌ)

తావత్కలిర్న ప్రభవేత్ప్రవిష్టోऽపీహ సర్వతః
యావదీశో మహానుర్వ్యామాభిమన్యవ ఏకరాట్

పరీక్షిత్తు పరిపాలిస్తున్నంత కాలం కలి ప్రభావం ఉండదు.

యస్మిన్నహని యర్హ్యేవ భగవానుత్ససర్జ గామ్
తదైవేహానువృత్తోऽసావధర్మప్రభవః కలిః

శ్రీ కృష్ణపరమాత్మ ఏ పూట ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళాడొ ఆ సమయంలోనే మరుక్షణమే అధర్మ వలన పుట్టిన కలి ఈ భూమండలంలోకి అడుగుపెట్టాడు

నానుద్వేష్టి కలిం సమ్రాట్సారఙ్గ ఇవ సారభుక్
కుశలాన్యాశు సిద్ధ్యన్తి నేతరాణి కృతాని యత్

కలిని పరీక్షిత్తు ద్వేషిచలేదు, నశింపజేయలేదు ఎందుకంటే తుమ్మెద పద్మంలో మకరందాన్ని ఆస్వాదిస్తుంది గాని పద్మాన్ని పాడుచేయదు (సారఙ్గ ఇవ సారభుక్). కలిలో ఉన్న దోషాలను హరించాలి తప్ప కలిని హరించకూడదు.
తెలివిగా ఉపాయంగా ప్రజ్ఞ్యతో ఆచరించిన పనులే నెరవేరుతాయి. లేకపోతే ఫలించవు
తక్కిన మూడు యుగాలలో లేని విశేషం కలియుగంలో ఉంది.

కిం ను బాలేషు శూరేణ కలినా ధీరభీరుణా
అప్రమత్తః ప్రమత్తేషు యో వృకో నృషు వర్తతే

చిన్నపిల్లలయందు శూరుడు ప్రవర్తించడు. కలిని కూడా పరీక్షిత్తు ఒక బాలుడిలా వదిలేశాడు. కాని కలికి ఆ కృతజ్ఞ్యత ఉండదు. తోడేలు ప్రాణులయందు ప్రవర్తిస్తుందో ఈ అధర్మం మనం పోవడానికి కారణమవుతుంది. ఎప్పుడు అజాగ్రత్తగా ఉంటాడొ ఎదురుచూస్తూ ఉంటాడు

ఉపవర్ణితమేతద్వః పుణ్యం పారీక్షితం మయా
వాసుదేవకథోపేతమాఖ్యానం యదపృచ్ఛత

నీవడిగిన పరమాత్మ కధతో కూడి ఉన్న పరీక్షిత్తు గురించి చెప్పాను. (పరీక్షిత్తు ఎలా పుట్టాడు, ఎలా పరిపాలించడు ఎలా కలిని శాసించాడు )

యా యాః కథా భగవతః కథనీయోరుకర్మణః
గుణకర్మాశ్రయాః పుమ్భిః సంసేవ్యాస్తా బుభూషుభిః

తెలియగోరువారు సేవించ వలసినవి పరమాత్మ కధలే - అవి పరమాత్మ గుణాలకి కర్మలకి సంబంధించినవి

ఋషయ ఊచుః
సూత జీవ సమాః సౌమ్య శాశ్వతీర్విశదం యశః
యస్త్వం శంససి కృష్ణస్య మర్త్యానామమృతం హి నః

నీవు ఎల్ల కాలం నీకీర్తితో జీవించి ఉండు గాక. మానవులకు అమృతంగా ఉండే కృష్ణుని కథను చెప్పావు
శిష్యులు ఎప్పుడు గురువు గారి దేహాన్ని జాగ్రత్తగా చూడాలి. గురువుగారు శిష్యుడి ఆత్మను గురువు కాపాడాలి

కర్మణ్యస్మిన్ననాశ్వాసే ధూమధూమ్రాత్మనాం భవాన్
ఆపాయయతి గోవిన్ద పాదపద్మాసవం మధు

ఊపిరిగూడా తీసుకోవడానికి వీలులేనంతగా ఉన్న సమస్యలు ఉన్న మాకు, పొగతో ఊపిరి ఆడకుండా ఉన్నవారికి గాలి వచ్చి ఎలా ఐతే ఊపిరి సలిపేలా చేస్తుందో. పరమాత్మ పాద పద్మ మకరందాన్ని మాచేత తాగిస్తున్నావు

తులయామ లవేనాపి న స్వర్గం నాపునర్భవమ్
భగవత్సఙ్గిసఙ్గస్య మర్త్యానాం కిముతాశిషః

ఈ శ్లోకం మనం రోజూ చదువుకోవాలి
పరమాత్మనే ఎప్పుడూ సేవించాలనే కోరిక ఉన్న మహానుభావునితో క్షణకాల కలయికతో లక్షలో లక్ష అంశలో కూడా స్వర్గం అపునర్భవం సాటి రావు. భక్తులతో ఒక్క క్షణం కలిసి ఉండే ఫలములోని కోటి యొక్క అంశతో స్వర్గము అపునర్భవమూ సాటి రావు

కో నామ తృప్యేద్రసవిత్కథాయాం మహత్తమైకాన్తపరాయణస్య
నాన్తం గుణానామగుణస్య జగ్ముర్యోగేశ్వరా యే భవపాద్మముఖ్యాః

పరమాత్మ కథలో రుచి తెలిసినవాడెవడైనా తృప్తిచెందుతాడా?
పరమాత్మ కథలు ఎప్పుడు ఐపోతాయి? ఆయన గుణాలు ఐపోయినప్పుడు. అవి ఎప్పటికీ అయ్యేవి కావు. ఏ గుణములూ లేని పరమాత్మ గుణాలకు అంతే లేదు. సత్వ రజో తమో గుణాలు లేని పరమాత్మ గుణాలు. భవపాద్మముఖ్యాః - బ్రహ్మరుద్రేంద్రాదులు కూడా ఆయన గుణ కీర్తనములతో అయిపోయాయి అనుకోరో అలాంటి కథలను విన్నవారు తృప్తి పొందుతారా

తన్నో భవాన్వై భగవత్ప్రధానో మహత్తమైకాన్తపరాయణస్య
హరేరుదారం చరితం విశుద్ధం శుశ్రూషతాం నో వితనోతు విద్వన్

పరమాత్మ గుణాలని వ్యాపింపచేయండి. సేవించే వారిని గురువుగారు కాదనరు (శుశ్రూషతాం ).
భవాన్ భగవత్ప్రధానో   - మీరు పరమాత్మ నామ గుణ కీర్తనలే ముఖ్యమని భావించే వారు
ఏకాన్తపరాయణస్య - భగవానుడు కూడా మీలాంటి వారి యందే ఉంటాడు

స వై మహాభాగవతః పరీక్షిద్యేనాపవర్గాఖ్యమదభ్రబుద్ధిః
జ్ఞానేన వైయాసకిశబ్దితేన భేజే ఖగేన్ద్రధ్వజపాదమూలమ్

మీరు చెప్పినదాని బట్టి పరీక్షిత్తు  భాగవతోత్తముడు. భగవంతుని చేతనే మహానుభావుడని కీర్తింపబడినవాడు.
శుకుని చేత మోక్షముకు మూఒలస్థానమైన ప్రమాత్మ జ్ఞ్యానం పొంది మోక్షం పొందాడన్నారు.
పరమాత్మ సంబంధమున్నది కాబట్టి అది కూడా చెప్పవలసింది

తన్నః పరం పుణ్యమసంవృతార్థమాఖ్యానమత్యద్భుతయోగనిష్ఠమ్
ఆఖ్యాహ్యనన్తాచరితోపపన్నం పారీక్షితం భాగవతాభిరామమ్

అసంవృతార్థమా - ఏ మాత్రం దాచకుండా ఆ ఆఖ్యానాన్ని చెప్పండి (సంవృతం అంటే దాచడం)
అన్నీ ఉన్నవాడు ఏడు రోజుల్లో మోక్షానికి వెళ్ళాడంటే అది అత్యద్భుత యోగ నిష్ఠం.
పరమాత్మ యొక్క ఆచరణతో కూడి ఉన్నది కాబట్టి (ఆఖ్యాహ్యనన్తాచరితోపపన్నం). ఇది భగవత్ భక్తులని ఆనందింపచేసేది (భాగవతాభిరామమ్)

సూత ఉవాచ
అహో వయం జన్మభృతోऽద్య హాస్మ వృద్ధానువృత్త్యాపి విలోమజాతాః
దౌష్కుల్యమాధిం విధునోతి శీఘ్రం మహత్తమానామభిధానయోగః

మహానుభావుల యోగం (సంసర్గం) వలన అద్భుతం జరుగుతుంది. నేను విళొమజుడిని (విలోమం : క్షత్రియుడి వలన బ్రాహ్మన స్త్రీకి పుట్టే వాడు. అనులోమం - బ్రాహ్మణుడి వలన క్షత్రియురాలికి పుట్టే వాడిని. సూతుడు స్త్రీ పురుష సమ్యోగంతో పుట్టినవాడు కాడు. పృధు చక్రవర్తి చేసిన యజ్ఞ్యంలో అగ్నిహోత్రునికి స్వాహాకారం ఇస్తూ ఇంద్ర మంత్రాన్ని పొరబాటున చదివాడు. ఇంద్రుడు క్షత్రియుడు అగ్ని బ్రాహ్మణుడు. క్షత్రియ బీజంతో బ్రాహ్మణ క్షేత్రంలో పుట్టినవాడు సూతుడు. ఎలాంటి పాపం చేయని నాకు ఇలాంటి జన్మ ఎందుకు ఇచ్చి శిక్షించారని అడిగితే - ప్రధానమైన అగ్ని హోత్రానికి పుట్టావు కాబట్టి, అగ్నిహోత్రం జ్ఞ్యానాన్ని అందిస్తుంది కాబట్టి అందరికీ జ్ఞ్యానాన్ని అందిస్తావు )
నేను విలోమ జాతున్నైనా నాకు బ్రహ్మ స్థానం ఇచ్చి సేవిస్తున్నారంటే పెద్దలను సేవిస్తే ఎలాంటివాడైన ఎంతటి వాడు అవుతాడొ అర్థమవుతుంది. దుష్టకులంలో పుట్టానన్న చింతను పెద్దల సంసర్గంతో తొలగించుకున్నాను. పరమాత్మ నామాన్ని ఉచ్చరిస్తే చాలు వాడు పెద్దవారందరికీ పెద్దవాడవుతాడు
మహత్తమానామభిధానయోగః - పెద్దల పేరు నోటితో పలికితేనే అన్ని శుభాలు కలుగుతాయి.

కుతః పునర్గృణతో నామ తస్య మహత్తమైకాన్తపరాయణస్య
యోऽనన్తశక్తిర్భగవాననన్తో మహద్గుణత్వాద్యమనన్తమాహుః

ఒక్క సారిపేరు చెబితేనే ఇంత గొప్ప వస్తే, నిరంతరమూ పరమాత్మనే ధ్యానిచే వాడి కథని చెబితే
అనంత శక్తి గల అనత గుణాలు కల పరమాత్మ కథనలు చెప్పేవాడు అనతుడే అవుతాడు (అందుకే ఆదిశేషునికి అనంతుడని పేరు. అనతమైన గుణాలు కలిగిన పరమాత్మను సేవించే శక్తి గల సేవకుడు అనంతుడే)

ఏతావతాలం నను సూచితేన గుణైరసామ్యానతిశాయనస్య
హిత్వేతరాన్ప్రార్థయతో విభూతిర్యస్యాఙ్ఘ్రిరేణుం జుషతేऽనభీప్సోః

ఇంతెందుకు యస్యాఙ్ఘ్రిరేణుం జుషతేऽనభీప్సోః -లక్ష్మీ దేవి అందరినీ వదిలిపెట్టి ఆమెను ఎవరు కోరలేదో ఆయననే వరించింది. లక్ష్మికి విభూతి అని పేరు. అలాంటి లక్ష్మీ పతి గుణాలని విడువకుండా పలికే మనకు రాని కీర్తి ఏమి ఉంటుంది

అథాపి యత్పాదనఖావసృష్టం జగద్విరిఞ్చోపహృతార్హణామ్భః
సేశం పునాత్యన్యతమో ముకున్దాత్కో నామ లోకే భగవత్పదార్థః

భగవంతుడని ఎవరిని అనాలంటే, ఎవరి యొక్క పాద తీర్థలను ఒకరు కడిగారు, ఒకరు శిరస్సున ఉంచుకున్నారు. భగవత్ పదానికి ఇంత కన్నా అర్థం ఏముంది. యత్పాదనఖావసృష్టం  - పాదం నుండి ఉద్భవించిన. బ్రహ్మదేవుడు పూజించడానికి తెచ్చిన జనం ఏ పాదములనుండి వెలువడి శంకరుని సహా మిగిలిన దేవతలను పునీతులని చేస్తుందో, భగవాన్ అన్న పదానికి ముకుందుడు తప్ప ఇంకెవరు అర్థమవుతారు

యత్రానురక్తాః సహసైవ ధీరా వ్యపోహ్య దేహాదిషు సఙ్గమూఢమ్
వ్రజన్తి తత్పారమహంస్యమన్త్యం యస్మిన్నహింసోపశమః స్వధర్మః

ఎవరి గుణాల యందు అనురాగం కలవారు దేహాత్మాభిమాన్నాని దేహాత్మ సంగతిని వదిలిపెట్టి అలాంటి పరమాత్మ సన్నిధికి చేరుతారు. ఎక్కడైతే హింస అనేది సంపూర్ణంగా తొలగుతుందో. హింసకు మూలమైన సకల గుణ నివృత్తి ఎక్కడ జరుగుతుండొ అలాంటి పరమపదానికి ఏ మహాత్ముని పాద పద్మాలు సేవించిన వారు వెళతారో - మోక్షమును ఇచ్చేవారు కాక మరెవరు భగవంతుడు అంటే?

అహం హి పృష్టోऽర్యమణో భవద్భిరాచక్ష ఆత్మావగమోऽత్ర యావాన్
నభః పతన్త్యాత్మసమం పతత్త్రిణస్తథా సమం విష్ణుగతిం విపశ్చితః

పక్షులు తమ తమ పక్ష బలాలను బట్టి ఆయా ఎత్తులకి వెళ్తాయి (పతన్త్యాత్మసమం ). పండితులు కూడా వారి జ్ఞ్యాననికి అనుగుణంగా ఆయా ప్రదేశాలకు జేరగలరు (కొందరు జ్ఞ్యానం, కొందరు భక్తి, కర్మ  ).

ఏకదా ధనురుద్యమ్య విచరన్మృగయాం వనే
మృగాననుగతః శ్రాన్తః క్షుధితస్తృషితో భృశమ్

కౄఉర మృగములు ప్రజల పాడిపంటలను దెబ్బతీస్తున్నాయన్న మాట విని అశ్వారూఢుడై వేటకు వెళ్ళాడు (సప్త వ్యసనాల్లో వేట ఒకటి ) అలా పరిగెత్తి అలసిపోయాడు ఆకలి దప్పిగొన్నాడు

జలాశయమచక్షాణః ప్రవివేశ తమాశ్రమమ్
దదర్శ మునిమాసీనం శాన్తం మీలితలోచనమ్

కనులు మూసుకుని యోగ సమాధిలో ఉన్న ఋషిని చూచి.

ప్రతిరుద్ధేన్ద్రియప్రాణ మనోబుద్ధిముపారతమ్
స్థానత్రయాత్పరం ప్రాప్తం బ్రహ్మభూతమవిక్రియమ్

ఇంద్రియ ప్రాణ మనసు బుధ్ధిని అరికట్టాడు. నిజముగా ప్రాణాయామం చేస్తే మన చుట్టుపక్కల ఉన్న శబ్దాలు వినపడకూడదు, స్పర్శ తెలియకూడదు. అయిదు విషయాలు తెలియకూడదు. మనసును కూడా అరికట్టాలి. ఏ ఇంద్రియం పని చేయడం మానేసిందో ఆ ఇంద్రియ శక్తి మనసుకు సంక్రమిస్తుంది. మనం మానేసిన దాన్ని మనసు పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకు మనసుని అరికట్టాలి. బుధ్ధిని కూడా అరికట్టాలి. బుధ్ధి ఏమీ అలోచించకుండా మనసు ఏమి సంకల్పించకుండా ఇంద్రియాలు ఏ విషయాలలో ప్రవర్తించకుండా ఉండటం ప్రాణాయామం.
దీనే ప్రతిరుధ్ధా అంటారు. అలగే ఉపారతం - పూర్తిగా లౌకిక జీవితాన్ని ఉపసమ్హరించుకున్నవాడు
స్థానత్రయాత్పరం ప్రాప్తం బ్రహ్మభూతమవిక్రియమ్- స్థాన త్రయం అంటే ఉదరం కంఠం శిరం. ఈ మూడిటినీ దాటిపోయాడు. భూ: భువ: సువ: లోకత్రయాలు దాటాడు. బ్రహం రుద్ర ఇంద్ర స్థానాలు దాటిన వాడు
 బ్రహ్మభూతమవిక్రియమ్ - తానే పరమాత్మ అయ్యాడు. బ్రహ్మ స్థితి యందు ఉన్నాడు. ఎవడు లోకాన్ని చూచి భయపడడో, లోకములు ఎవడిని చూచి భయపడవో తానే బ్రహ్మ.  ఆపద కలిగించే వాడు ఆపద కలిగించేది అన్న వేరు భావన ఉన్నవాడు బ్రహ్మాత్మకం జగదిదం అనుకోలేడు.  తాను ఏది కోరక ఎదుటివాడిలో భేధభావన చూపని వాడు బ్రహ్మ. పొందవలసినది ఏదీ లేక పొందాలన్న కోరిక లేని వాడు.
అవిక్రియం - ఎటువంటి వికారాలు లేని వాడు.

విప్రకీర్ణజటాచ్ఛన్నం రౌరవేణాజినేన చ
విశుష్యత్తాలురుదకం తథాభూతమయాచత

రౌరవేణాజినేన - రురు అనే జంతువు చర్మం ధరించి ఉన్నవాడు, జటలు వ్యాపించి ఉన్నవాడు.
విశుష్యత్తాలు- చెంపలు లోతుకు పోయినవాడు. అలాంటి ఆయనను నీరు అడిగాడు
(ఉదకం తథాభూతం) - నీటిని అడిగాడు)

అలబ్ధతృణభూమ్యాదిరసమ్ప్రాప్తార్ఘ్యసూనృతః
అవజ్ఞాతమివాత్మానం మన్యమానశ్చుకోప హ

అలబ్ధతృణభూమ్యాది - కూర్చోడానికి ఆసనం ఇవ్వలేదు. అర్ఘ్యం పాద్యంలేదు. గడ్డిపరకలేదు
అవజ్ఞాతమివాత్మానం- అవమానించాడు
అందుకు పరీక్షిత్తు కోపించాడు

అభూతపూర్వః సహసా క్షుత్తృడ్భ్యామర్దితాత్మనః
బ్రాహ్మణం ప్రత్యభూద్బ్రహ్మన్మత్సరో మన్యురేవ చ

మన శాంతి సహనం ఓర్పు, మన శరీరంలో వికారం కలగనంత వరకే. అందులో ప్రధానం ఆకలి దప్పి
క్షుత్తృడ్భ్యాం - ఆకలి దప్పీ.  ఈ రెండితో ఎలా ప్రవరించాలో మర్చిపోయి . ఆ మహర్షి మీద మాత్సర్యం వచ్చింది. ఇలా చేసినందుకు కోపం (మన్యు) వచ్చింది

స తు బ్రహ్మఋషేరంసే గతాసుమురగం రుషా
వినిర్గచ్ఛన్ధనుష్కోట్యా నిధాయ పురమాగతః

గతాసుమురగం - ప్రాణంపోయిన సర్పాన్ని ధనువు యొక్క కొసతో తీసి (ధనుష్కోట్యా ) ఆయనమీద వేసి వెళ్ళాడు. కలిపురుషుడు అడిగిన కొన్ని స్థాలాల్లో బంగారం ఒకటి. ఆయన్ కిరీటాన్ని నెత్తినపెట్టుకుని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే ఆ విషయం గుర్తుకు వచ్చింది. ఆయన పెట్టుకున్న కిరీటం జరాసంధుడిది. ఒకరు వాడే వస్తువులు ఇంకొకరు వాడకూడదు. ఆ వ్యక్తికీఇ వస్తువుకీ ఉన్న సంబంధంతో ఆ వ్యక్తి గుణాలు ఆ వస్తువుకి వస్తాయి.(ఈ భాగం పాద్మపురాణంలో స్కాంధపురాణంలో ఉంది. )

ఏష కిం నిభృతాశేష కరణో మీలితేక్షణః
మృషాసమాధిరాహోస్విత్కిం ను స్యాత్క్షత్రబన్ధుభిః

నిభృత అశేష కరణో  - అన్ని ఇంద్రియాలను అంతర్ముఖం చేసాడు
నాటకం అనుకున్నాడు పరీక్షిత్తు (మృషాసమాధి).

తస్య పుత్రోऽతితేజస్వీ విహరన్బాలకోऽర్భకైః
రాజ్ఞాఘం ప్రాపితం తాతం శ్రుత్వా తత్రేదమబ్రవీత్

ఈ సంగతి తెలిసిన ఆయన కుమారుడు. ఈ విషయాన్ని తెలుసుకున్నాడు (తాతం శ్రుత్వా). ఇలా అన్నాడు

అహో అధర్మః పాలానాం పీవ్నాం బలిభుజామివ
స్వామిన్యఘం యద్దాసానాం ద్వారపానాం శునామివ

బలిభుజామివ -బలిని తినేవి, (బలి భుక్) కాకులు. రాజులు మేమిచ్చే శక్తివల్ల బ్రతుకుతున్నారు . దాసుల్య్  యజమానుల విషయంలో అపచారం చేస్తారా. కుక్కలు యజమాని విషయంలో చేసినట్లు.

బ్రాహ్మణైః క్షత్రబన్ధుర్హి గృహపాలో నిరూపితః
స కథం తద్గృహే ద్వాఃస్థః సభాణ్డం భోక్తుమర్హతి

క్షతిర్యులు ద్వారపాలకులని నేను కొత్తగా అనట్లేదు. బ్రాహ్మణులందరూ క్షత్రియులని ద్వారపాలకులనే అంటారు.
ద్వారంలో ఉండాల్సిన వాడు ఇంటిలోకి వచ్చి యజమాని భాండంలో ఉన్న భోజనాన్ని భుజించడం ఎంత తప్పో.

కృష్ణే గతే భగవతి శాస్తర్యుత్పథగామినామ్
తద్భిన్నసేతూనద్యాహం శాస్మి పశ్యత మే బలమ్

కృష్ణపరమాత్మ వైకుంఠానికి వెళ్ళాడని వీళ్ళందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు.
(శాస్తర్యుత్పథగామినామ్ - శాస్తరి ఉత్పధ గామినాం -  అడ్డదారిలో వెళ్ళేవారిని శాసించే) కృష్ణపరమాత్మ
ఆయనవెళ్ళిపోయాడు కాబట్టి మమ్మల్ని ఎవరేమి చేయగలరు అనుకునే రాజులు చేసిన మర్యాద భంగానికి నా బలం చూపిస్తాను

ఇత్యుక్త్వా రోషతామ్రాక్షో వయస్యానృషిబాలకః
కౌశిక్యాప ఉపస్పృశ్య వాగ్వజ్రం విససర్జ హ

కౌశిక నదిలో నీటిని తీసుకుని అందరూ చూస్తుండగా. (వాగ్వజ్రం - వాక్కుని అగ్ని అంటారు) శాపాన్ని విడిచిపెట్టాడు.

ఇతి లఙ్ఘితమర్యాదం తక్షకః సప్తమేऽహని
దఙ్క్ష్యతి స్మ కులాఙ్గారం చోదితో మే తతద్రుహమ్

ఇలా మర్యాదని అధిక్రమించిన బ్రాహ్మణులకు ద్రోహం చేసిన (తతద్రుహమ్) వాడిని తక్షకుడు నేటికేడవరోజున నా ప్రేరణచే వధిస్తాడు. 

తతోऽభ్యేత్యాశ్రమం బాలో గలే సర్పకలేవరమ్
పితరం వీక్ష్య దుఃఖార్తో ముక్తకణ్ఠో రురోద హ

ఇంటికి వచ్చి తన తండ్రిని చూచి ముక్తకంఠంతో ఏడ్చాడు

స వా ఆఙ్గిరసో బ్రహ్మన్శ్రుత్వా సుతవిలాపనమ్
ఉన్మీల్య శనకైర్నేత్రే దృష్ట్వా చాంసే మృతోరగమ్

కుమార రోదన ధ్వని విని ఈ లోకానికి వచ్చి
కనులు తెరిచి తన మెడలో ఉన్న పాముని చూచి

విసృజ్య తం చ పప్రచ్ఛ వత్స కస్మాద్ధి రోదిషి
కేన వా తేऽపకృతమిత్యుక్తః స న్యవేదయత్

దాన్ని బయట పడేసి పిల్లవాడిని అడిగాడు ఎందుకు ఏడుస్తున్నావు. (తపసులో ఉన్న వారిని ఏ ప్రాణి ముట్టుకున్నా మరణిస్తుంది. అందుకే ఆ సర్పం వచ్చి మరణించిందా, మరణించిన్ వచ్చిందా అనేదీ అయానకు వెంటనే తైల్యలేదు)
ఎవరైనా నీకు హాని చేసార

నిశమ్య శప్తమతదర్హం నరేన్ద్రం స బ్రాహ్మణో నాత్మజమభ్యనన్దత్
అహో బతాంహో మహదద్య తే కృతమల్పీయసి ద్రోహ ఉరుర్దమో ధృతః

పిల్లవాడు చెప్పినదాన్ని విని 'శాపానికి తగని వాడు రాజు. అజ్ఞ్యానంతో చాలా పెద్ద తప్పు చేసావు. చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేశావు '

న వై నృభిర్నరదేవం పరాఖ్యం సమ్మాతుమర్హస్యవిపక్వబుద్ధే
యత్తేజసా దుర్విషహేణ గుప్తా విన్దన్తి భద్రాణ్యకుతోభయాః ప్రజాః

నీకు తేజస్సు తపసు పెరిగింది గానీ బుద్ధి పెరగలేదు. (పరిపక్వస్థితికి రాని వాడి శక్తి పరిమితంగా ఉండాలి) నృభిర్నరదేవం  - రాజు నర రూపం లో ఉన్న దేవం.
తన దివ్య ప్రతాపంతో అన్ని అమంగళాలను తొలగించి ప్రజలను కాపాడుతున్నాడు.

అలక్ష్యమాణే నరదేవనామ్ని రథాఙ్గపాణావయమఙ్గ లోకః
తదా హి చౌరప్రచురో వినఙ్క్ష్యత్యరక్ష్యమాణోऽవివరూథవత్క్షణాత్

పరమాత్మ అవతారాన్ని చాలించాక ఇతన్ని చూచే లోకం ధైర్యంగా బ్రతుకుతోంది. రక్షించని రాజు లేని లోకం. అవివరూథవత్క్షణాత్ - గొర్రెల కాపరిలేని గొర్రెల మందలా అవుతుంది రాజ్యం

తదద్య నః పాపముపైత్యనన్వయం యన్నష్టనాథస్య వసోర్విలుమ్పకాత్
పరస్పరం ఘ్నన్తి శపన్తి వృఞ్జతే పశూన్స్త్రియోऽర్థాన్పురుదస్యవో జనాః

కృష్ణుడు అవతారం చాలించాక మనని అంతబాగా పోషిస్తోన్న రాజు ని శపించడం వల్ల  మనకి ఘోరమైన పాపం వస్తుంది. రాజులేని రాజ్యంలో పశువులని స్త్రీలను ధనాని లాకుంటారు. ఒకరినొకరు చంపుకుంటారు నిందించుకుంటారు లాక్కుంటారు పెద్ద దొంగలు

తదార్యధర్మః ప్రవిలీయతే నృణాం వర్ణాశ్రమాచారయుతస్త్రయీమయః
తతోऽర్థకామాభినివేశితాత్మనాం శునాం కపీనామివ వర్ణసఙ్కరః

సజ్జన ధర్మం నశిస్తుంది. వర్ణ ఆచార వేద ధర్మాలు (తస్త్రయీమయః) ఉండవు.
అర్థకామాలు మాత్రల యందు మాత్రమే ప్రజలు మనసు లగ్నం చేస్తారు. వర్ణ సంకరం జరుగుతుంది. కోతులు కుక్కలూ కలిసినట్లుగా ప్రజలు వర్ణ సంకరానికి పాపడుతారు

ధర్మపాలో నరపతిః స తు సమ్రాడ్బృహచ్ఛ్రవాః
సాక్షాన్మహాభాగవతో రాజర్షిర్హయమేధయాట్
క్షుత్తృట్శ్రమయుతో దీనో నైవాస్మచ్ఛాపమర్హతి

ఈ రాజు గొప్ప కీర్తి కలవాడు పరమ భాగవతోత్తముడు, అశ్వమేధము చేసిన వాడు. అతను కూడా కావలని వచ్చి తప్పు చేయలేదు. ఆకలి దప్పి శ్రమ కలిగి వచ్చాడు.

అపాపేషు స్వభృత్యేషు బాలేనాపక్వబుద్ధినా
పాపం కృతం తద్భగవాన్సర్వాత్మా క్షన్తుమర్హతి

ఏ పాపం చేయనివారి యందు పరిపక్వబుద్ధి లేని నీవు పాపం చేసావు.భగవంతుడు ఈ తప్పును క్షమించుగాక

తిరస్కృతా విప్రలబ్ధాః శప్తాః క్షిప్తా హతా అపి
నాస్య తత్ప్రతికుర్వన్తి తద్భక్తాః ప్రభవోऽపి హి

నీవు శపించావని తెలిసి కూడా మహారాజు ఎటువంటి ప్రతిక్రియా చేయలేదు. ప్రతీకారం చేయగలిగినా మహానుభావులు ప్రతీకారం చేయరు. తిరస్కరించిన వెడలగొట్టినా శపించినా అధిక్షేపించినా చివరికి చంపినా (తిరస్కృతా విప్రలబ్ధాః శప్తాః క్షిప్తా హతా) అటువంటివారికి ప్రతీకారం చేయరు పరమాత్మ భక్తులు

ఇతి పుత్రకృతాఘేన సోऽనుతప్తో మహామునిః
స్వయం విప్రకృతో రాజ్ఞా నైవాఘం తదచిన్తయత్

కొడుకు చేసిన తప్పుకు ఆ మహా ముని బాగా పరితపించాడు. రాజు తనకు ఇలాంటి తప్పు చేసాడని అలోచిననేలేదు

ప్రాయశః సాధవో లోకే పరైర్ద్వన్ద్వేషు యోజితాః
న వ్యథన్తి న హృష్యన్తి యత ఆత్మాగుణాశ్రయః

ఇతరుల చేత ద్వందాల యందు బాధపడరు సంతోషించరు
లోకంలో సజ్జనులైన వాళ్ళు ఎదుటివాళ్ళు చేసిన మానావమానాల విషయంలో అంతా ఆత్మనే చూస్తారు. సర్వం ఖల్విద బ్రహ్మ అన్నట్టు ఉంటారు.

No comments:

Post a Comment